డాకిన్యాం భీమశంకరమ్

                         

                                6. డాకిన్యాం భీమశంకరమ్......                                                                                                                                                                               

ఇప్పుడు శ్లోకంలో ఉదహరించిన ఆరవ క్షేత్రాన్ని చూద్దాం. ఇది భీమాశంకరం. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో వుంది. దట్టమైన కీకారణ్యంలో, చాలా పురాతన కాలంలో కట్టిన అద్భుత శిల్ప శైలి గల ఆలయం అది. పక్కనే భీమా నది. ఈ ఆలయానికి వెళ్లడం నిజంగా చాలా కష్టం. ఎందుకో ముందు ముందు చెప్తాను. ఈ క్షేత్రం గురించి ఆది శంకరులు ఇలా చెప్పారు.

యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి ||

శాకినీ డాకినీ శక్తులున్న సమాజంలో, శనైశ్చరుడు కూడా వున్నచోట, భీముడైనట్టి ఆ భక్త హితంకరుడైన శంకరునకు నమస్కారం అని. ఇక్కడ భీమా అనే పదానికి రెండు అర్ధాలు ప్రధానంగా చెప్తున్నారు. ఆ విషయం స్థలగాధలో కలిపి చెప్తాను.
                      
భీముడనే రాక్షసుడు కుంభకర్ణుని పుత్రుడు. తండ్రి మరణానంతరం పుట్టినవాడు. పెద్దయ్యాక తన తండ్రిని, బంధువులను చంపినది రాముడని తెలిసి ఆ రాముడ్ని ఓడించడానికి భయంకరమైన తపస్సు చేసి వరాలు పొందాడు. ఆ తపోబలం వల్ల దేవతలనందరినీ పీడిస్తుంటే శంకరుడు అమ్మవారి శక్తిని కూడా తోడు చేసుకుని అర్ధనారీశ్వర రూపంలో తన శరీరాన్ని భీమముగా అంటే పెద్దగా పెంచేసి ఆ భీముడ్ని అతనికి తోడైన ఇతర రాక్షస గణాలను నిర్జించాడు. అప్పుడు అతని దేహం నుంచి వెలువడిన స్వేదమే భీమానదిగా ప్రవహించిందట. అప్పుడు భక్తులందరూ శంకరుని శక్తి సహితంగా అక్కడే కొలువై ఉండమని ఆరాధించటంతో శివుడు అక్కడ భీమాశంకరుడనే నామంతో అర్ధనారీశ్వరుడుగా వెలిసాడు. ఈ కధలో రాక్షసుడి పేరు భీముడు. శివుడు కూడా భీమశరీరం ధరించి వాణ్ని సంహరించాడు. అక్కడ ప్రవహిస్తున్న నది పేరు భీమా. ఇది కృష్ణానదికి ఉపనది. ఇది పోయి పోయి కర్ణాటకలోని రాయచూర్ వద్ద కృష్ణానదిలో కలుస్తుందట. ఈ అన్నింటివలన ఇక్కడి దేవుడికి భీమా శంకరుడనే పేరు వచ్చింది. మరో కథలో శివుడు శక్తి సహాయంతో భీమా రూపం దాల్చి ఇక్కడ త్రిపురాసురుడనే రాక్షసుణ్ణి చంపాడు అని కూడా వుంది అని చెప్పారు. ఏ కథ నిజమో సరిగ్గా తెలియదు.



ఇక్కడ లింగం అర్ధనారీశ్వరలింగం. అంటే ఒకే సాలగ్రామ శిలాలింగం మధ్యలో ఒక పాపిడి వలే ఏర్పడి, లింగాన్ని రెండు భాగాలుగా చేస్తూ ఉంటుంది. ఒక భాగం శివుడు, మరో భాగం శక్తి అని అక్కడి పూజారులు చెప్పారు. ఆ లింగం కింద నుంచి ఎల్లప్పుడూ నీరు వస్తూ ఉంటుంది. అదే భీమానది నీరు అని చెప్పారు. మేము వెళ్ళినప్పుడు పట్టుమని  ఓ పదిమంది కూడా లేరు జనం. పూజారి చక్కగా అభిషేకం అర్చన అన్నీ చేసాడు. లింగం విశిష్టత, ప్రత్యేకత చెప్పాడు. బైటికి వస్తే శనిదేవత విగ్రహం వుంది. దానికి నూనె పొయ్యమన్నాడు. కానీ మేము నూనె తీసుకువెళ్ళలేదు. మా దగ్గర లేదు. ఆ రోజుల్లో, 2013లో, ఆ ప్రదేశం అంతా ఏమంత సందడి లేదు. కానీ పూజల కోసం ఏమి కొనుక్కోవాలన్నా, గుడిలో పూజారులు అన్నీ అక్కడే అందించారు. శని విగ్రహం పక్కనే ఒక పెద్ద కాన్లో నూనె వుంది. అది తీసుకుని పొయ్యమన్నాడు. దానికి డబ్బులు అక్కడే పెట్టిన హుండీలో వెయ్యమన్నాడు. ముందే బైట కొనుక్కోవబోవటానికి కూడా కారణం వుంది. ముందు ముందు చెప్తాను. పూజారి ఇచ్చిన నూనె శనైశ్చరునికి పోసి, దణ్ణం పెట్టుకుని, డబ్బులు హుండీలో వేసేసి అక్కడ వున్న పెద్ద గంటను ఆశ్చర్యంగా చూసి బయటకు వచ్చాము. 


అక్కడే గోరక్షానాథుడు తపస్సు చేసుకున్నాడట. అప్పుడు వెలిగించిన హోమగుండం, ధుని, ఇంకా వెలుగుతోంది. ఆయన శిష్య పరంపర ఇంకా ఆ ధుని ఆరిపోకుండా సేవ చేస్తున్నారు. మమల్ని అక్కడికి పిలుచుకుని వెళ్లి, ఆ ధుని కోసం దానం చేస్తే చేయమన్నారు. దానం చేస్తే, అక్కడికక్కడే రసీదు కూడా ఇచ్చారు. ఇంకా మమ్మల్ని ధుని ముందు కూర్చోబెట్టి, ఇద్దరి చేతికీ రక్ష కట్టారు. ఈ రక్ష ఉంటే ఆ అడవి దారిలో ఏ ప్రమాదమూ లేకుండా ఉంటుందని మా నమ్మకం అని చెప్పారు. అప్పుడప్పుడే కాస్త చీకట్లు పడుతున్నాయి. ఆ ధునికీ, వాళ్లకీ, నమస్కారం చేసి తిరిగి మెట్లెక్కడానికి మొదలు పెట్టాం. మనసు నిండా ఏదో గొప్ప సంతృప్తి. ఎంతో కష్ట సాధ్యమైన క్షేత్రాన్ని చూశామని ఒక ఆనందం. సాధారణంగా అలాంటప్పుడు, నేను, మా అయన ఒకళ్ళనొకళ్ళం ఆనందంగా చూసుకుని, మౌనంగానే ఒకళ్ళనొకళ్ళం ప్రశంసించుకుంటూ ఉంటాం. అది ఇక్కడ కూడా జరిగింది. ఈ క్షేత్రానికి కూడా అఫిషియల్ వెబ్ సైట్ వుంది. కొత్తగా వెళ్లే వాళ్లకు చాలా ఉపయోగం. మేము ఈ యాత్రలన్నీ చేసినప్పుడు ఇవేవీ లేవు. కొన్ని ప్రదేశాలకైతే, వివరాలు చాలా కష్టం మీద కానీ దొరకలేదు. ఈ రోజుల్లో ఈ సౌకర్యం వుంది కదా అని నా ప్రతి పోస్ట్ లోనూ ఆ లింక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. https://bhimashankar.in/

అసలు ఈ యాత్ర చెయ్యడానికి మేము పడిన కష్టం, ఆ గుడి వరకూ చేరడానికి మేము చేసిన ప్రయత్నాలూ చెప్తాను. చదవండి. తమాషాగా ఉంటుంది. హైవే మీద నుంచి  భీమాశంకరానికి వెళ్లాలంటే ఒక మలుపు దగ్గర లోపలికి తిరిగి ఘాట్ రోడ్ పట్టుకోవాలి. ఎంతకీ రాదే ఆ భీమాశంకరం మలుపు, ఆ మలుపు దాటాక పూర్తిగా ఫారెస్ట్ ఘాట్ రోడ్లో, ఒక 60 కిలోమీటర్ల ప్రయాణం. హైవే మీద 60 కిలోమీటర్లు,  ఘాట్ రోడ్లో ఇంకో 60 కిలోమీటర్లు అనుకున్నాం. గట్టిగా మూడు గంటల్లో వెళ్లిపోవచ్చనేది మాలెక్క. హైవే మీద ఒక రెండు, మూడు గంటలు నడిపి అప్పుడు పట్టుకున్నాడు ఘాట్ దారి. ముందు ఒక పల్లె వచ్చింది, అక్కడ ఏదో మార్కెట్ వుంది. వాళ్ళను అడిగితే ఘాట్ రోడ్ కి దారి చెప్పారు. మధ్యలో మా డ్రైవర్ నేను అప్పటికే 200 కిలోమీటర్లు నడిపానని గోల పెట్టుకున్నాడు. మా అదృష్టం కొద్దీ అప్పుడే రోడ్ మీద, పూనా  60 కిలోమీటర్లు అని రాసిన స్టోన్ కనిపించింది. అది చూపించాక ఇక పేచీలు పెట్టలేదు. ఘాట్ రోడ్ లోకి ఎంటర్ అయ్యాము. చుట్టూ ఎక్కడా పిట్టపురుగు లేదు. కారులో మేము ముగ్గురం. ఆ డ్రైవర్ మాతో హైదరాబాద్ నుంచీ వచ్చిన వాడే. మా ప్రోగ్రామ్ మొత్తం ఒక 10 రోజుల పాటు మహారాష్ట్ర యాత్ర. మేము ఏనాడూ రాత్రిపూట ప్రయాణం చేయం. రాత్రి లోపల ఒక మంచి హోటల్ చూసుకుని ఆగిపోయి, పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ చేసి బయల్దేరటమే అలవాటు. లంచ్, డిన్నర్ సమయం, స్థలం చూసుకుని చేస్తూ ఉంటాం. ఆ ఘాట్ రోడ్ లో ఎటువంటి హెల్ప్ లేదు, మా చేతుల్లోని స్మార్ట్ ఫోన్, మ్యాపులు తప్ప. పోనీ దారి తప్పామా అంటే, మరొక రోడ్ కనుచూపు మేరలో లేదు కనుక దారి తప్పే అవకాశమే లేదు. పరిసరాలు మాత్రం పచ్చగా భలే అందంగా  వున్నాయి. చక్కటి పంట పొలాలు, మంచి కాపు మీద వున్నాయి. ఆశ్చర్యం వేసింది, ఒక్క మనిషీ లేకుండా ఈ పంటంతా, ఎవరు పండిస్తున్నారూ, ఎవరికోసం పండిస్తున్నారూ అని. అలా పోగా పోగా ఒక టోల్ గేట్ వచ్చింది. మళ్ళీ అమ్మయ్య, మనిషనేవాడు కనిపించాడు అనుకుని, అతనికి టోల్ కట్టి వివరాలడిగితే మేము వెళ్తున్న దారి సరి అయినదే అని చెప్పాడు. 

చివరికి దాదాపు మధ్యాన్నం రెండయ్యిందనుకుంటా భీమా శంకరం చేరేసరికి. ఇంకేముంది చేరిపోయాం గుడికి అనుకుంటే అక్కడ చుట్టుపక్కల యేవో రెండు, మూడు షాపులు, హోటళ్లు తప్ప ఏ ఇతర నిర్మాణమూ లేదు. గుడి లాంటిది అస్సలు లేదు. ఆ షాపుల వాళ్ళను అడిగితే, అక్కడి నుంచి ఓ 500 గజాల దూరంలో వున్న వీధిని చూపిస్తూ అక్కడ మెట్లు వున్నాయండీ ఓ 400 మెట్లు దిగాలి అన్నారు. ఒక్కసారి గుండె జారిపోయింది. ఇక నోట మాట రాలేదు. అక్కడిదాకా వచ్చి వెనక్కు పోలేము. గుడికి వెళ్లాలంటే కిందకు దిగాలి, అంతే కాదు, మళ్ళీ ఎక్కాలి కూడా కదా. అప్పుడు నేను, ఇక్కడ వున్న ఫుడ్ లో నచ్చినది తిందాం అంటున్నా, ఇంతలో ఎక్కడినుంచి వచ్చారో ఓ ఐదారుగురు కూలీలు వచ్చారు. డోలీలు పట్టుకుని. డోలీలో తీసుకెళతాం అండీ అంటూ. ముందర ఏమన్నా తిననివ్వండి, మళ్ళీ చూద్దాం అని వాళ్లకు చెప్పి భోజనము చేసాం. ఫుడ్ నిజంగానే చాలా బాగుంది. థాంక్ గాడ్.

రమేష్ గారికి కాలికి కొంచెం ప్రాబ్లమ్ వుంది కదా అని మీరు డోలీ మీద రండి అన్నా. ఆయనకు పంతం వచ్చింది, నేనెందుకు దిగలేనూ అని. ఇంక యెంత చెప్పినా వినలేదు. సరే, తప్పేదేముంది. కాలినడకన దిగి, ఎక్కాల్సిందే అని నిశ్చయించుకున్నాం. ఈ డ్రైవర్ ముస్లిం, గుడులకు తోడు రాడు. పైగా అన్ని మెట్లంటే అసలే రాడు. ఇక మేం ఇద్దరమే దిగటం మొదలుపెట్టాం. మా బరువుకి తోడు అవీ ఎందుకు అని పూజా సామగ్రి ఏమీ అక్కడ కొనలేదు, కింద చూసుకుందాంలే అనుకుని. మధ్యలో ఇంకొంత మంది కూడా కలిశారు. పైకి ఎక్కే వాళ్ళూ కనిపించారు. కష్టం ఏమీ లేదండీ, ఆరాం గా వెళ్లి రావచ్చు అని ధైర్యం చెప్పారు. వాతావరణం ఎంత బావుందంటే, చెప్పలేనంత ఆహ్లాదంగా, చల్లగా, మంచి కొండగాలి, చెట్లూ, పూలూ, ఆ పరిమళం అద్భుతం. ఇప్పుడు అవ్వన్నీ తలచుకుంటే, మళ్ళీ వెళ్లాలనిపిస్తోంది. పైకి చూస్తే ఆకాశం, కిందకి చూస్తే మనోహరమైన లోయ. ఆహా ఎంత బావుందీ అనుకుంటూ దిగిపోయాం. ఆ డోలీల వాళ్లు మా బేరం కోసం ఎక్కువ మెట్లు చెప్పారేమో అనిపించింది. పైగా మెట్లు కూడా ఎక్కువ ఎత్తు లేవు, శ్రీనగర్ లో శంకరాచార్య పర్వతం లాగా. దిగాక మహాద్భుతమైన గుడి, చిన్న చిన్న కొలనులు. భలే సంతోషం వేసింది. అమ్మయ్య దిగేసాం అనుకున్నాం. అక్కడ కాళ్లు కడుక్కుని గుడిలోకి వెళ్లాం. అదీ కధ. మీకూ నచ్చిందా.


 ఓం శ్రీ భీమాశంకరాయనమః,  ఓం శ్రీ శనైశ్చరాయనమః  

            ఇప్పుడు సేతుబంధేతు రామేశం అనుకుంటూ రామేశ్వరం వెళదాం. 


భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650



కామెంట్‌లు

  1. "నేను, మా అయన ఒకళ్ళనొకళ్ళం ఆనందంగా చూసుకుని, మౌనంగానే ఒకళ్ళనొకళ్ళం ప్రశంసించుకుంటాం." <== బాగుంది!

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నిర్వాణషట్కమ్

ఓంకారమమలేశ్వరం

హిమాలయే తు కేదారం